ఈ సృష్టిలో "దేవుడు" అనేవాడు ఉన్నాడా, చాలా మంది ఆలోచించే విషయం. మనిషి ఆస్తికుడైనా, నాస్తికుడైనా దేవుడి గురించి, సృష్టిలోని అతీత శక్తుల గురుంచి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే దేవుడంటే ఎలా ఉంటాడు? ఆకారుడా? నిరాకారుడా? ఆకారుడైతే ఎలా ఉంటాడు? ప్రపంచములో ఇన్ని సంఘటనలు ఎలా జరుగుతున్నాయి? ప్రకృతి భీభచ్చాలు ఎన్నో వస్తున్నాయి.సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. చావు పుట్టుకలు జరుగుతున్నాయి. ఇవి మనిషి అదుపాజ్ఞలలో లేని పనులు. వాటంతట అవే జరుగుతున్న విషయాలు. అదే అతీత శక్తి.
ఈ అతీత శక్తినే మనిషి భగవంతునిగా పూజిస్తున్నాడు. మన ప్రాచీన నాగరికతను బట్టి ప్రజలు భగవంతుడిని అనేక నామాలతో పూజించేవారు.
భగవంతునికి , వేదాంతానికి సారుప్యంగా అణువులను తీసుకుంటే, ఈ స్థూల జగత్తు అంతా అణువులతో ఏర్పడింది. అణువులోని సూక్ష్మ జగత్తులోకి వెళ్తే మిగిలేది శూన్యం. అంటే అణువులను ఛేదించుకుంటూ వెళ్తే పదార్థమంటూ మిగలదు. కేవలం శక్తి రూపాలుగా మిగులుతాయి. అంటే కంటికి కనిపించని శక్తి ఉన్నదనేది అనివార్యం. ఉంటె ఆ శక్తి ఎలా ఏర్పడింది? మొదట్లో ఈ విశ్వం బ్రహ్మానువు రూపంగా ఉండేదని, అది విస్ఫోటనం చెంది విస్తరించిందని శాస్త్రవేత్తల భావన. దీనినే మన పూర్వులు సృష్టి, స్థితి, లయ, కారకాలుగా విభజించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించి పూజించారు. అయితే భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? అనే విషయానికి వస్తే రెండూ అని చెప్పవచ్చు. పైన చెప్పినట్లు ఈ విశ్వంలో అతీత శక్తి ఉన్నప్పుడు, దానికి రూపం ఏర్పరచుకోవడం, పూజించడం సమంజసమే. అయితే శక్తికి రూపం లేదు కదా? భగవంతుడు లేడా? అంటే ఇక్కడ స్వామీ వివేకానందుడు చెప్పిన విషయం ఒకటుంది. మనిషికి ఆలోచించే మనసుంది కాబట్టి, మానవుడు దేవుణ్ణి మూడు ముఖాలతో, నాలుగు చేతులతో ఉహించుకున్నాడు. ప్రతి జీవికి ఆలోచించే మనసుంటే అవి వాటి రుపాలతోనే భగవంతుని ఉహించుకుంటాయి.
విశ్వంలో శక్తి అనివార్యమైనపుడు దానిని రూపంలో గాని రూపము లేకుండా గాని పూజించి, ఆరాధించడం సమంజసమే! మన పూర్వులు భగవంతుడ్ని ఆరాధించే మార్గాన్ని ఎన్నో విధాలుగా గ్రంధస్తం చేసి, భక్తి, జ్జ్ఞ్యాన, వైరాగ్యముగా విభజించి,
దేవాలయాలు నిర్మించి భావితరాలకు మార్గదర్శకం చేశారు.